Monday 28 October 2013

మునెమ్మ ప్రతీకారం...

మునెమ్మ నవల 2008లో ప్రచురితమైంది. రచయిత డాక్టర్ కేశవరెడ్డి.

కథా విషయం:– 

మునెమ్మ పల్లెటూరి పడుచు. జయరాముడు ఆమె భర్త. అతను మొరటుదనం, కరుకుదనం కలిగిన మనిషి. తనకు తోచింది తప్ప ఎవరి మాటా వినే రకం కాదు. 

మునెమ్మ అత్తవారింట కాపురానికి వచ్చిన రోజే పుట్టిన బొల్లిగిత్త అంటే ఆమెకూ, కుటుంబ సభ్యులకే కాదు, ఆ ఊరి వారందరికీ ఇష్టమే. వీధిలో పోతూ ఉంటే జయరాముణ్ణీ, బొల్లిగిత్తనూ రామలక్ష్మణులనేవారు. బొల్లిగిత్తను తమ బిడ్డగా భావించి మునెమ్మ జయరాములిద్దరూ తమ చేతి మీద దాని బొమ్మ పచ్చ పొడిపించుకుంటారు. ఆ బొల్లిగిత్త వారి జీవనాధారం కూడా. 

ఒకరోజు బొల్లిగిత్త మునెమ్మ మీదకు రెండు కాళ్లతో లేచి లైంగిక చేష్ట లాంటిది ప్రదర్శించటం చూసిన జయరాముడు రెచ్చిపోయి పారతో దాడి చేస్తాడు. చావబాదినా బొల్లిగిత్తపై కోపం తగ్గక దాన్ని సంత (పరస)లో అమ్మేసి కొత్త గిత్తను కొంటానని అక్కణ్ణించి ఆవేశంగా వెళిపోతాడు. ఈ సన్నివేశంతోనే కథ మొదలవుతుంది. ఈ కథ అంతట్నీ మనకు చెప్పేది జయరాముడి దూరపు చుట్టమైన సినబ్బ. 

జయరాముని తల్లి సాయమ్మ బొల్లిగిత్తను జయరాముడు చావబాదాడని మునెమ్మ ద్వారా తెలుసుకుంటుంది. జయరాముణ్ణి తిడుతుంది. అతనికి ఈ మొండితనమూ, అకారణంగా కోపం తెచ్చుకోవటము లాంటి లక్షణాలన్నీ అతని తండ్రి (తన భర్త) దొరసామి నుంచే వచ్చాయంటుంది. 

సాయమ్మ భర్త దొరసామి తాగుబోతు, వ్యక్తిత్వ పరంగా మొరటువాడు, ఎవరికీ తలవంచడు. నాటకాలంటే ఆసక్తి లేకపోయినా ఆ హడావుడిని ఇష్టతాడు. ఊళ్లో నాటకాలొస్తే దొరసామి భార్య సాయమ్మ తన పట్టుచీరను అతనికి తెలియకుండా నాటకాలవాడికి ద్రౌపది వేషం కోసమని ఇస్తుంది. దొరసామి తన భార్య చీర పరాయి మగవాడు కట్టుకోవడాన్ని భరించలేక ఆవేశానికి లోనై నాటకాల వాణ్ణి కత్తితో నరికి చంపుతాడు. జైలుపాలవుతాడు. అక్కడ కూడా తోటి ఖైదీలతో గొడవలు పడుతూ, అధికారుల్ని ఎదిరిస్తూ, ఒక రోజు కొందరు ఖైదీలతో  కలిసి జైలు నుండి పారిపోతాడు. వారిలో కొంతమంది పోలీసు కాల్పుల్లో చనిపోతారు. వాళ్లలో దొరసామి ఉన్నదీ లేనిదీ ఎవరూ నిర్థారించి చెప్పకపోవటంతో ఎప్పటికీ అతని ఆచూకీ తెలియకుండా పోతుంది. సాయమ్మ మాత్రం భర్త బుద్ధులు తన కొడుక్కీ రాకూడదని దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఈ కథనంతా ఆమె సినబ్బతో నెమరు వేసుకుంటుంది. 

ప్రస్తుతంలోకి వస్తే... ఇంటికి వచ్చిన జయరాముడు సంతకి బొల్లిగిత్తను అమ్మడానికి తీసుకు వెళ్తున్నట్టు చెప్తాడు. సాయమ్మ మొదట వ్యతిరేకిస్తుంది గానీ, మునెమ్మ పట్ల బొల్లిగిత్త ప్రవర్తించిన తీరు తెలుసుకున్నాకా, అమ్మేయటమే మంచిదంటుంది. 

పొరుగూరిలోని పశువుల సంత దాకా తన ప్రయాణ ప్రణాళిక ఏమిటన్నది మొత్తం జయరాముడు ఆ రాత్రి తన తల్లికి చెప్తాడు. ఒంటరిగా కాకుండా, పశువుల దళారి తరుగులోడిని కూడా వెంటబెట్టుకు వెళ్తున్నట్లు చెప్తాడు. 

అలా వెళ్లినవాడు రెండ్రోజులైనా తిరిగి రాకపోయేసరికి సాయమ్మ, మునెమ్మ కంగారు పడతారు. ఇంతలో మునెమ్మకు కల వస్తుంది. దాని ఆధారంగా తన భర్త బతికి లేడనే నిర్ణయానికి వస్తుంది. పైగా మరుసటి రోజు బొల్లిగిత్త ఒంటరిగా ఇంటికి తిరిగి వస్తుంది. దాని కొమ్ముకున్న సంత చీటీ అనే ఒక్క ఆధారాన్నీ పట్టుకుని మునెమ్మ భర్త కోసం బయల్దేరుతుంది. వెళ్తూ సినబ్బ (మనకు కథ చెప్తున్న పాత్ర)ను కూడా వెంటబెట్టుకు వెళ్తుంది. 

దళారి తరుగులోణ్ణి ఆరా తీస్తుంది. అతని మాటల్లో తడబాటును బట్టి అతను చెప్తున్నది అబద్ధమని మునెమ్మకు రూఢీ అవుతుంది. పూటకూళ్ల ముసలి దంపతులను, సంత సంచాలకుణ్ణి, సంతలో కల్లుపాక యజమానినీ విచారించిన తర్వాత, తన భర్త జయరాముడు బొల్లిగిత్తను పశువుల వైద్యం చేసే మందులోడికి అమ్మినట్టు తెలుసుకుంటుంది మునెమ్మ. సినబ్బతో కలిసి అతని ఊరు రామినాయుడు పల్లెకు వెళ్తుంది. అక్కడికి చేరే సరికి మందులోడు మరణశయ్య మీద ఉంటాడు. ఆవుకి వైద్యం చేయబోతే కొమ్ము విసిరిందని అతని భార్య అబద్ధం చెపుతుంది. అసలే చావుబతుకుల్లో ఉన్న మందులోడు మునెమ్మ ఎడం చేతి మీద బొల్లిగిత్త పచ్చబొట్టు చూసి భయంతో చచ్చిపోతాడు. దాంతో బొల్లిగిత్తే మందులోడి చావుకి కారణమని మునెమ్మ అనుమానిస్తుంది. తర్వాత అతని పెద్ద కొడుకు ద్వారా నిజం తెలుసుకుంటుంది మునెమ్మ. మందులోడూ తరుగులోడూ ఇద్దరూ కలిసి తన భర్తని చంపేశారని ఖాయపర్చుకుంటుంది. ఇక మిగిలిన తరుగులోడిపై మునెమ్మ ఎలా ప్రతీకారం తీర్చుకుందన్నదే ముగింపు. 

నా అభిప్రాయంలో మునెమ్మ:– 

కథ ప్రారంభంలో మునెమ్మ పాత్ర అమాయకంగా కనిపించినా, భర్త హంతకుల్ని వెతికే క్రమంలో ఆమె ఎక్కడ లేని మొండి ధైర్యాన్ని, ప్రవర్తనలో పరిణతినీ ప్రదర్శిస్తుంది. భర్త ఇక లేడు అనే భావనే ఆమెలో అంతకుముందు లేని ఈ నిబ్బరాన్నీ, నేర్పరితనాన్నీ కల్పించాయనిపిస్తుంది. నాకు ఇక ఎవరూ లేరు అనే భావన రాగానే ప్రతి స్త్రీలోనూ మొండిధైర్యం ప్రవేశిస్తుంది. 

మునెమ్మ తనలోని అనుమానాలను చూపుల ద్వారా తెలుపుతుందే కానీ, మనసు విప్పి ఎవరితోనూ పంచుకోదు. మాట్లాడిన కాసిని మాటల్లోనూ తాత్త్విక ధోరణి తొంగి చూస్తుంది. ఆ మాటలు ఎక్కడా పల్లెపడుచు మాటలుగా మనకు అనిపించవు. 
“కాలు దీసి వీధిలో పెడితే దారి దానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదికి వచ్చే ముందు ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం? ఇవన్నీ ఆలోచించే వచ్చామా?” 
“అడుగుదాం. సమయమొచ్చినపుడు గొంతు మీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తైతక్కలాడగానే గాలాన్ని లాగుతామా? బెండు నీళ్ళలో మునిగినప్పుడు గదా గాలాన్ని లాగుతాం.”
ఇలాంటి తాత్త్విక ధోరణీ, ఈ అరుదైన పోలికలూ మునెమ్మవా, లేక రచయితవా అనే సందేహం కలుగుతుంది. 

కానీ ఆమె ఇలా ఎంత అరుదైన ఉపమానాలు వాడినా, ఎంత లోతైన తాత్విక ధోరణి ప్రదర్శించినా, ఆమె మాటల్లోని యాస వల్ల  మనం కాస్త సులువుగానే సమాధాన పడతాం. కానీ కథను మనకు చెప్పే సినబ్బ విషయంలో అలా సమాధాన పడలేం. అతని మాట తీరూ, అతను వాడే పదజాలమూ, కథను నేర్పుగా వెనకా ముందులు చేసి చెప్పటం... వీటి వల్ల మనకు కథ చెప్పేది ఒక పల్లెటూరి యువకుడని అనిపించదు. బాగా విజ్ఞానవంతుడెవరో చెప్తున్నట్టు అనిపిస్తుంది. 
“వాస్తవ జగత్తులోని సంఘటనలు మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చివేయడం మనం చూసినదే. అలాగే స్వప్న జగత్తులో జరిగిన సంఘటనలు కూడా జీవిత దృక్పథాన్ని మార్చివేయగలవని నేను చెప్పగలను. అందుకు మునెమ్మే సాక్ష్యం. స్వప్నంలో ఆమె చూసిన దృశ్యాలు ఆమెలోని ప్రతి అణువునూ కుదిపి వేశాయి. స్వప్నానంతరం ఆమె కార్చిన కన్నీళ్ళు, ఆమెలోని సకల సందిగ్ధతలను, సకల సంశయాలను, సకల జడత్వాలను కడిగి వేశాయి.” 
ఇలా సాగుతుంది సినబ్బ కథనం. మునెమ్మకు రచయిత తన ఉపమానాల్ని మాత్రమే అరువిచ్చాడు. సినబ్బకు తన శైలి కూడా అరువిచ్చేశాడని అనిపిస్తుంది. ఈ శైలి కథా వాతావరణానికి నప్ప లేదు. సినబ్బ కూడా మునెమ్మలా యాసలో మాట్లాడి ఉంటే కథకు బాగా నప్పేదేమో అనిపిస్తుంది. ఇలాంటివి కొన్ని లోటుపాట్లుగా అనిపించినా కథలో ఉత్కంఠ కారణంగా మనం మనసులోనే సమాధాన పడుతూ చదువుకుంటూ పోతాం. పైగా ఈ రచన మేజికల్ రియలిజం అనే ధోరణి ఆధారంగా రాసిందని అన్నారు గనుక, ఇలాంటి పొసగని అంశాలు ఎన్నో ఆ పేరు మీద చెల్లిపోతాయి. 

భర్త హంతకుల్ని చంపటమే భర్తకు తాను చేసే అంత్యక్రియలుగా భావిస్తుంది మునెమ్మ. పట్టుదలగా వాళ్లని వెంటాడి తుదముట్టిస్తుంది. ప్రతీకారం కోసం ఆమె ప్రయాణమే ఈ నవల.     

ఈ సమీక్ష పుస్తకం.నెట్‌లో ప్రచురితం

Wednesday 16 October 2013

ఆశ నిరాశల దోబూచులాట “ఊరి చివర ఇల్లు”

అమృతం కురిసిన రాత్రి అందరూ నిద్రపోయే వేళ దోసిళ్ల కొద్దీ అమృతాన్ని తాగిన కవిగానే తిలక్ నాకు తెలుసు. ఈ కథతో ఆయన నాకు కథకునిగా మొదటిసారి పరిచయం అయ్యాడు.

కథా విషయం:– ఊరికి దూరంగా పచ్చని పొలాల నడుమ, చింత చెట్లు తుమ్మ చెట్ల మధ్య, చూరు వంగి, గోడలు బెల్లులు ఊడి ఉందా ఇల్లు. మనుష్య సంచారం ఆ ఇంట ఉందా అనే సందేహం కలగక మానదు కొత్త వారికి. ఆ ఇంటిలో ఒక యువతి, ఆమెతో పాటు ఒక అవ్వ ఉన్నారు.

వాతావరణం దట్టమైన మబ్బులతో కప్పి ఉండి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. ఇరవై మూడేళ్ళ ఆ యువతి ఇంటి వరండా లోంచి అలా కురుస్తున్న వర్షాన్ని చూస్తూంది. తనలో రేగుతోన్న ఆలోచనలకు, దిగులుకు, దుఃఖానికి రూపాన్ని వెతుకుతున్నట్లు ఉన్నాయామె శూన్యపు చూపులు.

రోడ్డంతా గతుకులతో బురదతో నిండి ఉంది. వర్షపు నీరు ఆ ఇంటిముందు కాలువలుగా ప్రవహిస్తుంది. చలిగాలి కూడా తోడయింది ఆ వాతావరణానికి.

అంతలో వర్షంలో తడుస్తూ, బురదలో కాళ్లీడ్చుకుంటూ ఆ ఇంటి మందుకు వచ్చాడో యువకుడు. తాను తన మిత్రుణ్ణి కలవడానికి గాను ఈ ఊరు రావలసి వచ్చిందని, తిరిగి రైల్వే స్టేషన్‌ వెళ్లాల్సిన తనకు వర్షం అడ్డంకిగా మారిందని అంటాడు. ఈ రాత్రి ఇక్కడే ఉండి వాన తెరిపిచ్చాకా తెల్లవారి వెళ్ళమంటుందామె. అవ్వ అతన్ని లాంతరు వెలుగులో చూసి  లోపలికి రమ్మంటుంది. అతను తన పేరు జగన్నాధం అని చెపుతాడు. కమ్మని భోజనం తిని, తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాడు. ఆ యువతి తన పేరు రమ అని పరిచయం చేసుకుంటుంది. ఆమె మనసు మూలలో ఎక్కడో అతడు తన చిన్ననాటి మిత్రుడేమో అనే అనుమానం కలుగుతుంది. కానీ అతని గతం విన్నాకా అది నిజం కాదని తెలుసుకుంటుంది.

తనకు ఒక ఊరంటూ లేదని, ఎవరు లేని ఒంటరినని, గతంలో సైన్యంలో పని చేసి ఎన్నో దేశాలు తిరిగి వచ్చానని చెపుతాడు. ప్రస్తుతం ఒక మందులు తయారు చేసే కంపెనీలో ఉంటున్నానని చెపుతాడు. అలాగే ఆమె ఇంకా పెళ్ళి చేసుకోపోవడానికి కారణం ఏమిటని చొరవగా ప్రశ్నిస్తాడు. రమ ఆ ప్రసక్తి తప్పించుకోజూస్తుంది. అతను పట్టుబట్టి పదే పదే అడిగేసరికి తన గతాన్ని పంచుకుంటుంది.

రమ బాల్యంలోనే తల్లిని పోగొట్టుకుంది. తండ్రి ఆమెను అనాధాశ్రమంలో చేర్పించి ఎటో వెళిపోయాడు. ఆ చిన్నతనంలో ఆమెకు ఏకైక స్నేహితుడు విజయుడు. అతనికి రమ అంటే వల్లమాలిన ప్రేమానురాగాలు. సవతి తల్లి చేత దెబ్బలు తిని మరీ ఆమెను సంతోషపెట్టేవాడు. వయసుతో పాటూ ప్రేమ పెరిగింది. సవతి తల్లి బలవంతంగా మరో పెళ్ళి చేయాలని చూస్తే ఆమెను కొట్టి ఊరు నుండి పారిపోయాడు. కొన్నాళ్ళకు తాను సైన్యంలో చేరానని, బతికి ఉంటే మళ్ళీ కలుస్తానని అతణ్ణించి రమకు ఉత్తరం అందింది. యుద్ధం ముగిసిన ఎన్నాళ్ళయినా అతను మాత్రం తిరిగి రాడు. ఈలోగా అనాథాశ్రమంలో రమను చేరదీసిన వార్డెన్ చనిపోవడంతో ఆమెకున్న ఆ ఒక్క నీడ కూడా కరువవుతుంది. ఓ పెద్దమనిషి మాయమాటలతో ఆమెను ఈ ఊరు తీసుకువచ్చి అవసరం తీరాకా ఒంటరిగా వదిలేస్తే చివరకు అవ్వే ఆమెకు దిక్కైంది.

ఈ కథంతా విన్నాకా చలించిపోయిన జగన్నాధం రమకు తోడుగా నిలవాలనుకుంటాడు. ఆ మాటతో ఆమెలో బతుకుపై ఆశ చిగురించింది. అతను తనకు ఉన్నాడన్న భద్రతలో హాయిగా నిద్రపోతుంది.

వీరి మాటలన్నీ చాటుగా విన్న అవ్వ, జగన్నాధాన్ని గది నుంచి బయటకు పిలుస్తుంది. రమ డబ్బు కోసం ఇలాంటి అబద్దాలనే ఇంటికి వచ్చే ప్రతీ విటునితోనూ చెపుతుందని అవి నమ్మవద్దనీ అతని మనసు కలుషితం చేస్తుంది. అది నమ్మిన జగన్నాధం మనసు వికలమై, తన డబ్బు పర్సును రమ పడుకుని నిద్రపోతున్న మంచం మీదకు విసిరి ఆ ఇంటి నుండి వెళిపోతాడు.

మర్నాడు రమ నిద్రలేచి జగన్నాధం కోసం వెతుక్కుంటుంది. అవ్వని అడిగితే డబ్బు ఇచ్చి వెళిపోయాడంటుంది. రమ నివ్వెరపోయి, అతనికి నువ్వేం చెప్పావని నిలదీస్తుంది. నువ్వు వెళిపోతే నా దిక్కేం కాను, అందుకే నీదంతా నటన అనీ, వచ్చిన ప్రతి వాడి దగ్గరా ఇదే వేషం వేస్తావనీ చెప్పానంటుంది.

రమ ఆవేశంతో శివాలెత్తి అవ్వని ముక్కాలిపీటతో కొడుతుంది. జగన్నాధం విసిరేసిన పర్సు తీసుకుని ఆదరాబాదరాగా రైల్వే స్టేషన్‌కు పరుగుపెడుతుంది. గోతుల్లో పడి లేస్తూ వళ్లంతా బురద గొట్టుకుపోయి స్టేషన్‌కు చేరుకుంటుంది. అప్పటికే రైలు ప్లాట్‌ఫాం మీదకు వచ్చేసి ఉంటుంది. ఆమె పెట్టెలన్నీ వెతుకుతుంది. ఆఖరు పెట్టెలో కిటికీ దగ్గర కూర్చున్న జగన్నాధం ఆమె కంటపడతాడు. ఈలోగా రైలు కదలడం మొదలవుతుంది. ఆమె కిటికీ పక్కన పరిగెడుతూ చేతిలోని పర్సును పెట్టెలోకి విసురుతుంది. జగన్నాధం మొదట ఆమెని పోల్చుకోలేకపోతాడు. ఫ్లాట్‌ఫాం మీద కుప్పకూలిన ఆమెను చూసి జాలిపడుతూ పర్సు తీసి చూసుకుంటాడు. పర్సులో అతని డబ్బులన్నీ యథాతథంగా ఉంటాయి. అతని ఫొటో తప్ప.

నా అభిప్రాయం:– కాలం ఆడిన ఆటలో ఓడిపోయి అవ్వ చెంతకు చేరిందా అభాగ్యురాలు. ఆమె అందాన్ని పణంగా పెట్టి డబ్బు సంపాదించాలని ఆశించిందా అవ్వ. ఆమె కంటూ బంధాలు ఉంటే ఎక్కడ తనకు రాబడి పోతుందో అనే భయంతో పసికందును కూడా దూరం చేసింది అవ్వ.

చిన్న ఓదార్పు కోసం ఎదురు చూసే అమాయకురాలు తనకు ఎదురైన మనిషిని మనసున్నవాడిగా భావించి తన మనసులో చెలరేగుతున్న గతం తాలూకు జ్ఞాపకాలను, చేదు నిజాలను, తాను బతుకుపై పెట్టుకున్న ఆశలను అతనితో పంచుకుంది. ఈ అనుకోని అతిథి తన గతం తెలిసీ భర్తగా తన చేయందుకుంటాడనీ, తన జీవితానికి చిరు దివ్వెగా ఉంటాడనీ ఆశపడింది. పెళ్ళి అనే బంధంలోని తీయదనాన్ని తలచుకుంటూ, తెల్లవారితే తన జీవితంలో ప్రకాశించే వెలుతుర్ని కలగంటూ నిదురలోకి జారుకున్న ఆమెకు అంతా కల్ల గానే మిగిలిపోయింది. మళ్ళీ తన జీవితంలో చీకటే మిగిలింది.

నిజ జీవితానికి దగ్గరైన కథను రచయిత సరళంగా చెప్పిన తీరు మనసు కదిలించేలా ఉంది. ఆశ నిరాశల మధ్య ఊగిసలాడి ఓడిపోయిన జీవితం ఆమెది. ఒక్కరాత్రిలో ప్రేమించిన వాడు, అంత త్యరగానూ ద్వేషించాడు. తన జీవితానికే గమ్యం లేని వాడు, చివరకు ఆమెనూ ఒక గమ్యానికి చేర్చలేకపోయాడు.

Tuesday 8 October 2013

ఉత్కంఠ భరితం "చంద్రగిరి శిఖరం"


బిభూతి భూషణ్ గారు బెంగాలీలో ప్రముఖ రచయిత. పదహారుకు పైగా నవలలూ, రెండొందల పైచిలుకు కథలూ రాశాడు. వాటిలో బాగా ప్రసిద్ధి పొందినవి “పథేర్ పాంచాలి”, “అపరాజితుడు”, “వనవాసి” అనే మూడు నవలలు. ఇవన్నీ ఇదివరకే తెలుగులో వచ్చాయి. ఇపుడు వీటిలా ఆత్మకథాత్మకంగా కాక, కాల్పనిక శైలిలో రచించిన “చంద్రగిరి శిఖరం” (చందే పహార్) కూడా కాత్యాయని గారి అనువాదంతో తెలుగులో వచ్చింది.

స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, అందులోని విలయాలను, వింతలను, విశేషాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు.

కథా విషయం:- శంకర్ ఓ పల్లెటూరి కుర్రవాడు. చదువు పూర్తి చేసుకొని గ్రామానికి వస్తాడు. కుటుంబ పరిస్థితుల వల్ల కెన్యాలోని మెుంబాసా దగ్గర రైల్వేశాఖలో గుమస్తాగా పనిలో చేరతాడు. అత్యంత ప్రమాద భరితమైన ఆ ప్రాంతం మానవుని రక్తాన్ని మరిగిన సింహాలకు నిలయమని తెలుసుకుని అక్కడికి ముఫ్పై మైళ్ల దూరంలోని కిసుమూ రైల్వే స్టేషన్‌కి స్టేషన్ మాస్టరుగా కొత్త ఉద్యోగంలో చేరతాడు. అక్కడ జనసంచారం తక్కువ. ఒక రోజు ఆ అటవీ ప్రాతంలో ఒక పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్ అపస్మారక స్థితిలో కనిపిస్తాడు. శంకర్ అతణ్ని బతికిస్తాడు. అతను వజ్రాలకై తాను చేసిన సాహసయాత్రను గురించి చెప్తాడు. సాహసాలంటే మక్కువ గల శంకర్ అతనితోపాటూ తానూ సాహసయాత్రకు సిద్ధపడతాడు. ఇద్దరూ వజ్రాల కోసం ఆఫ్రికా అటవీ ప్రాంతంలోని చందేర్ పహార్ చేరుకుంటారు. ఈ యాత్రలో వారు దట్టమైన అడవుల్నీ, వింత జంతువుల్నీ, పక్షుల్నీ, సెలయేళ్ళనీ, వర్షాలు వరదలూ తుఫాన్లనీ, ఎడారుల్నీ... ఎన్నింటినో దాటుకు సాగుతారు. అగ్నిపర్వతం బద్దలవటం కూడా తమ కళ్ళతో చూస్తారు. ఏన్నో కష్టాలతో సాగిన ఈ యాత్రలో శంకర్ వజ్రాలగనిని చేరాడాలేదా అనే దాని కన్నా, అతడు ఆ భయంకర పరిస్థితుల నుండి ప్రాణాలతో బయటకు రాగలడా అనే ఉత్కంఠే మనకు ఎక్కువ కలుగుతుంది.

బిభూతి భూషణ్ గారి శైలి సరళంగా సాగుతుంది. ప్రకృతి వర్ణనలు స్వయంగా అనుభవించి రాసినట్టు స్వచ్ఛంగా ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే, తాను ఎరిగిన బెంగాల్ సరిహద్దులతో పాటూ, తాను ఎప్పుడూ చూడని ఆఫ్రికా అరణ్యాల అందాలను, అందులోని ప్రమాదాలను ఎంతో మనోహరంగా వర్ణించగలిగాడు. ఆయన శైలికి మచ్చుతునకగా ఈ భాగాన్ని ఉదహరిస్తాను:
ఎంతటి భయద దృశ్యమది! వాళ్ళిద్దరూ ఆ వైపునుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు. నిప్పు ముద్దల్లా ఉన్న మేఘాలు కిందికి దిగి అగ్ని పర్యతపు ముఖ భాగాన్ని సమీపించి, మరుక్షణంలోనే అగ్నిజ్యాలలుగా మారి వెయ్యి అడుగుల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. ఆ పగలూ, రాత్రీ కూడా అగ్ని పర్వతం మీదనుండి బాణాసంచా పేలుస్తున్న వెలుగులాంటిది కనబడుతూనే ఉంది. ఆ పర్వతం కింది భాగాన ఉన్న లోయలోని పెద్దపెద్ద వృక్షాలన్నీ రాళ్ల వర్షంతోనూ, అగ్నిజ్యాలలతోనూ ధ్యంసమయ్యయి. రాత్రి బాగా పొద్దుపోయాకా మళ్ళీ ఒకసారి పర్యతం బద్దలై నిప్పులు చిమ్మే అద్బుత దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ మంటల వెలుగు, కనుచూపు మేరదాకా అడవికంతటికీ రుధిరవర్ణం పులిమింది. రాళ్ళవర్షం మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. అగ్ని పర్వతపు అరుణ వర్ణాన్ని ప్రతిఫలిస్తున్న ఆకాశంలో నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి మేఘాలు.
దృశ్యాన్ని తెచ్చి ముందు నిలిపే ఇలాంటి వర్ణనలతో పాటూ, ఊహాశక్తిని వింత దారుల్లో నడిపించే కథనం మనలో ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగుతుంది, ఆద్యంతం ఒక సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. మన ఆలోచనల్లో ఆ ప్రాంతాలను, ఆ ప్రకృతినీ చిత్రించుకుంటూ చదువుకుంటూ పోతాం. ఆ సాహస యాత్రలో, ఆ ప్రమాదాల మధ్య మనమూ ఉన్నామా అనే భ్రమకులోనవుతాం. అనువాదకురాలు కాత్యాయని గారి శైలి సరళంగా ఉండి ఎక్కడా అనువాదంగా తోచలేదు. అచ్చ తెలుగు కథగానే అనిపించింది.

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...