Tuesday 24 June 2014

స్త్రీ లోకపు వెలుగు నీడలు : ఇస్మత్ చుగ్తాయ్ కథలు

పి. సత్యవతి గారి అనువాదంలో ఇస్మత్ చుగ్తాయ్ కథలు చదివాకా నా అభిప్రాయాన్ని కినిగె పత్రికలో క్లుప్తంగా చెప్పాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి. మీరూ చుగ్తాయ్ కథలు చదవండి. లింక్ ఇదిగో:--



ఒక రచయిత గురించి చెప్పాలంటే రచయిత వ్యక్తిగా ఎవరో తెలిస్తే కాస్త బాగా చెప్పగలుగుతాం. కానీ ఏమీ తెలియకపోయినా చుగ్తాయ్ కథలే ఆమె గురించి చాలా చెపుతాయి. ఆమె కథావస్తువులు, ఆలోచనలు అన్నీ ఆమె జీవితంలో నుండి పుట్టినవే. ఏ చిన్న విషయాన్నయినా ఆమె కథగా రాయగలరని ఈ పుస్తకం నిరూపిస్తుంది. బేగమ్‌ జాన్‌, కుబ్రాతల్లి, కుబ్రా, ఆమె చెల్లీ, రుక్సానా, హలీమా, గోరీబీ, సరలాబెన్‌, బిచ్చూ అత్తయ్య, వదినె, షబ్నమ్‌, ఇల్లూడ్చే ముసలమ్మ, ఫర్హత్‌… ఇలా పాత్రలన్నీ ఆమె పెరిగిన, ఎరిగిన వాతారరణంలో నుండి వచ్చినవే. చెప్పాలనుకున్నది సూటిగా, నిక్కచ్చిగా చెప్పడం చుగ్తాయ్ కథల ప్రత్యేకత. ఆమె ఈ కథలు రాసింది ఉర్దూలోనే అయినా తెలుగులోకి భావం ఏ మాత్రం చెడకుండా వచ్చింది. దీనికి అనువాదకురాలు పి. సత్యవతిగారిని అభినందించాలి. అన్నీ స్త్రీ చుట్టూ తిరిగే కథలే ఐనా ఏ కథా మరో కథలా ఉన్నట్టు అనిపించదు. ఆడపిల్లలపై ఆంక్షలు, సాంప్రదాయికమైన కట్టుబాట్లూ వీటన్నింటికీ చుగ్తాయ్ బద్ధవ్యతిరేకి అని ఆమె కథలు చెప్తాయి.
సంప్రదాయ ముస్లిమ్ కుటుంబంలో అన్నల తర్వాత ఆడపిల్లగా పుట్టి, అన్నలానే ఆటపాటలలోనూ, చదువులోనూ పోటీ పడుతూ పెరిగింది చుగ్తాయ్. బాల్యంలో లేని ఆంక్షలు ఎదుగుతున్న కొద్దీ ఎదురవటంతో ఆమె ఎదురుతిరిగింది. ఆడపిల్లకు ఉత్తరం రాసే చదువు చాలునంటూ, ఇక చదవటం ఆపి వంటా కుట్లూఅల్లికలూ నేర్చుకోమంటే, కిస్టియన్ మతంలో కలిసిపోయి కాన్వెంట్లో చదువుకుంటాను గానీ ఇంట్లో కూర్చోనంటూ మొండికేసి ధైర్యంగా తన నిర్ణయాన్ని తెలిపింది. ఆడవారి జీవితాల గురించి చిన్నతనం నుండే నిశితమైన పరిశీలన కనిపిస్తుంది ఆమెలో. ఎదుటివారిని కూర్చోబెట్టి మాటలాడి వారి రహస్యాలు చాకచక్యంగా తెలుసుకోగల నేర్పరి. తన తోటి స్త్రీ జీవితాలనూ ఆమె అంత చాకచక్యంగానే తెలుసుకొని తన కథల్లో ఇమిడ్చింది. కొన్ని కథల ఇతివృత్తాలు ఇలా సాగుతాయి:
లిహాఫ్:— భర్తతో వివాహబంధం సరిగాలేని స్త్రీ, అతని ప్రేమను, అనురాగాన్నీ పొందలేని స్త్రీ లైంగికంగా దిగజారిపోయిన కథ ఇది. దీన్ని తన చిన్ననాటి జ్ఞాపకంగా చెప్పుకొచ్చింది చుగ్తాయ్. ఇలాంటి కథలను రాసి, సమాజంలోనికి తీసుకురావడానికి ఎంతటి గుండె ధైర్యం, సాహసం కావాలి. ఈ కథతో ఏంతటి దుమారం లేచినా చలించలేదు ఆమె. దాన్నంతట్నీ ధైర్యంగా ఎదుర్కొన్నది.
మేలిముసుగు:— ఈ కథ చెపుతున్న గోరీబీ పురుష స్పర్శ ఎరుగని ఎనభై ఏళ్ళ కన్య. కోటి ఆశలతో కొత్తగా సంసార జీవితంలోకి అడుగుపెట్టిన గోరీబీ, భర్తకు ఎదురైన ఓ చిన్న ఆత్మనూన్యతా భావం, అర్థం చేసుకోకలేనితనం వల్ల ఓ నిండుజీవితం శిక్ష అనుభవిస్తుంది.
శిల:— భార్యగా, కోడలిగా, తల్లిగా తన బాధ్యతలను నిర్వహించడంలో మునిగిపోయిన చుగ్తాయ్ వదిన కథ ఇది. బంధాలకు విలువ ఇచ్చింది కానీ, కరిగిపోతున్న అందాల గురించి పట్టించుకోలేదామె.
ఒక ముద్ద:— నర్సు సరళాబెన్‌కు పెళ్ళి చేసుకోవాలని మనసులో ఎంత ఉన్నా సరైన వయసులో ఆ ముచ్చట జరగలేదు. అందరికీ తలలో నాలుకలా ఉన్న ఆమె ఓ ఇంటిది ఐతే బాగుంటుంది అనుకున్నారు ఇరుగుపొరుగు వాళ్ళు. బస్సులో ఒక వ్యక్తి సరళాబెన్‌కు రోజూ లేచి సీటు ఇవ్వటం చూస్తాడు ఆమె పొరుగింటతను. అంతా సరళాబెన్‌కు ఆ వ్యక్తికీ ముడిపెడదామని ప్రయత్నిస్తారు. ఆమెని అలంకరించి పంపిస్తారు. కానీ విధి ఆమెను వెక్కిరిస్తుంది.
బిచ్చు అత్తయ్య:— అన్నగారి మీద ప్రేమను తిట్లతోనే చూపిస్తుంది బిచ్చు అత్తయ్య. మాట కరుకేగానీ మనసు వెన్న. అన్నగారంటే పంచప్రాణాలు.
అమృతలత:— దేవుడిచ్చిన అందం ఆమెకు శాపమే అయింది. వయసులో తనకంటే పెద్దవాడైన భర్తను అమితంగా ప్రేమించింది. తరుగుతున్న వయసు అతనిలో అసూయను నాటింది.
ఇలా సాగుతాయి చుగ్తాయ్ కథలు. తన చిన్నతనంలో అమ్మ చెప్పిన మాటలను చుగ్తాయ్ జీవితాంతం గుర్తుంచుకున్నది. “ఇది పురుషుల కోసం పురుషులు తయారు చేసిన ప్రపంచం. ఈ ప్రపంచంలో స్త్రీ ఒక పాత్ర మాత్రమే. పురుషుని ప్రేమకో, ద్వేషానికో ఒక అభివ్యక్తి లాంటిది స్త్రీ. అతని చిత్తవృత్తులను బట్టి ఆమెను ప్రేమించడమో, తిరస్కరించడమో జరుగుతుంది.” ఈ మాటల్లోని సారం ఆమె ప్రపంచాన్ని చూసే విధాన్ని చాలా ప్రభావితం చేసిందని అనిపిస్తుంది. ఆమె కథలన్నీ ఈ సారాన్నే పదునుగా వ్యక్తం చేస్తాయి. ఒకరకంగా ఇస్మత్ మన చలానికి ఆడవెర్షను అనిపిస్తుంది.
– శ్రీశాంతి దుగ్గిరాల

Thursday 19 June 2014

కర్కశత్వాల మధ్య కమలిన సాత్వికత: మూలింటామె


                                   
                                                                                                                                                                                                                                     
మూలింటామె నవల చదువుతున్నంత సేపు ఏదో ఆశక్తి చివరకు ఆమె వస్తుందా తన సంసారాన్ని, భర్తను కాదనుకున్నా, బిడ్డలను కూడా వదిలేస్తుందా? ఇలానే ఏన్నో అనుమానాలు. జీవితంలోంచే కథలు పుడతాయంటారు. హాస్యంగా చెప్పినా, ఆలోచింపచేసినా అది నామిని గారికే చెల్లింది. మూలింటామె నవల ఓ కథకన్నా మించి పాఠకుడిని ఆలోచింప జేసే నవల.  మూలింటామె నమినిగారి రచనల్లో ఓ కొత్త కోణాన్ని చూపించింది.

ఓ చిన్న ఊరు. అందులో తల్లీకూతుళ్ళు, మనవరాలు. ముగ్గురి ఆడవాళ్ళకు ఓక్కో కథ. అందరికంటే అమాయకంగా కనిపించే కొనమ్మ
ఊరికి దూరంగా ఉన్నారని కుంచమమ్మ కాస్తా తన ఈడు వాళ్లకు కూడా మూలింటామె అయిపోయింది. కూతురికి తనలాంటి రాత కలిగిందని ఆమెను, బిడ్డనూ ఆదరించి పెంచి పెద్ద చేసి తన కొడికిచ్చి పెళ్ళి చేసింది. ఉన్నట్టుండి మనవరాలు సంసారాన్ని, భర్తను, బిడ్డలను విడిచి వెళ్ళిందనే విషయాన్ని నమ్మలేకపోయింది. అమాయకమైన మనవరాలి ముఖం గుర్తుచేసుకుంది. అమాయకురాలు, జాలి గుండెది, అందరినీ అదరించే ఆమె, ఆ ఇంటి దీపం లేకపోతే ఆ ఇల్లు, పిల్లలు, చెట్లు, చేలు, పశువులు అన్నీ అనాధలైపోతాయి. ఏం చెప్పాలి నువ్వు లేనిదే ఓరోజు గడవదమ్మా అన్నా వినలేని అంత దూరం నువ్వెళ్ళి పోయావు. మరి తిరిగిరావు. 

కూతురు తమ పరువుతీసిందంటూ ఊరితో నోరుకలిపింది నడిపామె. తన కుటుంబం ఊళ్ళో తలేత్తుకు జీవించాలని తమ్ముడికి మరో పెళ్ళి చేసింది. రెండో పెళ్ళాంగా వచ్చిన  వసంత తన మాటతీరుతో చుట్టు పక్కల వారితో మంచిగా ఉంటూ  పరాయి మగవాళ్ళతో బరితెగించి ప్రవర్తించినా కళ్ళున్న గుడ్డి లోకం మాట కూడా మాట్లాడదు. ఇవన్నీ చూస్తూ మాటైనా మాట్లాడక సమర్థించిన కొడుకు పౌరుషంలేని తనం చాలా చిత్రంగా అనిపిస్తుంది మూలింటామెకు. 

ఇద్దరు బిడ్డలను, భర్తను విడిచి వెళిపోయిన తన మనవరాలి గురించి మనసులోనే మథన పడింది. తన మనవరాలి మంచితనం  పరులనోటితో విన్నపుడు మూలింటామె మనసు ప్రేమగా మూలిగింది. ఎంత సుకుమారంగా చూసుకున్నామమ్మా, ఇలాంటి ఆలోచనచేసి ఎందుకు నాకు దూరమయ్యావంటూ  రోధించింది మూలింటామె. తన ఇంటికి రెండో కోడలిగా మనవరాలి స్థానంలోకొచ్చిన వసంత మాలింటామెకు మనవరాలిపై ఉన్న మమకారాన్నీ, ప్రేమను, ఆస్థానాన్ని అందుకోలేకపోతుంది. అందరికీ తెలిసేలా తప్పుచేసి మంచిదైన నామనవరాలు ఈ ఊరోళ్ళకు చెడ్డదైపోయింది. నంగనాచిలా వసంత ఊరోళ్ళోతో చొరవగా మసులుకోవడం, పరాయి మగాళ్ళతో రాసుకుపూసుకు తిరిగినా అందరికీ మంచిదైపోయింది. ఒక కుటుంబానికి కష్టమొస్తే ఓదార్చే వారికన్నా, ఆనందించేవారే ఎక్కువ. ఎదుటివాళ్ళను తూట్లు పొడవాలని చూసే రాబందులే ఉన్నారు మన చుట్టూ. మనకో కన్ను పోయినా పరవాలేదు, ఎదుటివాడికి రెండు కళ్ళు పోవాలనేవారికి ఉదాహరణలు రంజకం, మొలకమ్మ, రంగబిళ్ళ పాత్రలు. వయోభేధం చూడకుండా తండ్రిలా లాలించి, ఎత్తుకు పెంచిన మేనమామే ఆమెకు భర్తయ్యాడు. తన మనవరాలు తనింటి కోడలు కావాలనుకుందే కానీ దాని జీవితం వయసు ముదిరిన కొడుకుతో చివరిదాకా ఎలా ఉంటుందో ఆలోచించలేదు మూలింటామె.  సమస్యను సృష్టించుకునేది, దాని ఫలితం చూసి విచారించేది మనమే.  కొనామె అమాయకపు మనసుకు, ప్రేమ ఎరుగని మనసుకు, ఎవరు జాలి చూపినా, కాస్త ప్రేమగా మాట్లాడినా ఆమె జన్మ ధన్యమే. కళాయోడి అమాయకపు మాటలు ఆమె మనసులో అంతగా ముద్ర వేశాయి. ఆవేశంలో తప్పుచేసానని అనుకుని మళ్లీ ఇంటికి రావాలనుకోలేదు కొనామె. ఒకసారి ఆ గడప దాటాకా ప్రాణం పోయినా తిరిగి ఆ గడప తొక్కకూడదనుకుంది. తాను తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉండిపోయింది. కొనామె వెళ్ళాలనుకున్నా ఆ ఇంట ఏం మిగిలింది కనుక. పాడి పోయింది. పచ్చని చెట్లు మోడులైనాయి. తనకు ఇక ఆ కుటుంబంతో రుణం తీరిపోయిందనుకుంది. గడప దాటిన ఆడది ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకుంది. దానికి కారణాలు ఏమిటి అని విశ్లేషించనవసరం లేకుండా సూటిగా ఆమె కుటుంబ పరిస్థితులు చెప్పుకు రావడం అనవసరం అని రచయిత ఆ ఆలోచనను పాఠకుని మనస్సుకే వదిలేసాడు.

కాలం మారుతున్నా మరెంత మారినా, మనిషి ఆలోచనలో మార్పురానంత వరకు స్త్రీ జీవితంలో పెద్దగా మార్పురాదు. భర్తతో ఏం పొరపచ్చాలో తెలపడం అవసరం కాదు ఇక్కడ మూల విషయం. ఓ స్త్రీ ఇల్లు విడిచి వెళ్ళిందంటే తన కుటుంబం, జాలి తలచి వెనక్కు తీసుకు వెళ్ళాలన్నా సాహసం చేసినా కూడా హర్షించదు కదా దుమ్మెత్తి పోస్తుంది ఈ లోకం. అదే ఓ మగాడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అప్పుడు కూడా అది ఆడదాని లోపం కిందకే జమ కడుతుంది. ఎందుకు ఈ వ్యత్యాసం.  

మనవరాలినిపైనే ప్రాణాలు పెట్టుకున్న మూలింటామె ప్రాణాలు విడిచే క్షణంలో చివరి మాటలు కూడా మనవరాలి మీద తన ప్రేమను మరోసారి తెలిపాయి."నా మనవరాలు మొగుణ్ణొదిలేసింది. అంతేకాని, మియాం మియాం అంటా నీ కాళ్ల కాడా నాకాళ్ల కాడా చుట్టకలాడే పిల్లిని చంపలేదే" పిల్లిని చంపితే దానంత ఎత్తు(బరువు) బంగారం దానం ఇవ్వాలనే నమ్మకం ఉంది. అంటే పిల్లిని చంపినా పాపమేమో గాని నా మనవరాలు చేసిన ఆలోచన, తీసుకున్న నిర్ణయం తప్పుకాదని మరోసారి చేప్పిందన్నమాట. 






పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...