Monday 30 September 2013

మనం కోల్పోయిన ప్రపంచాన్ని గుర్తు చేసే "బంగారు మురుగు"



శ్రీరమణ గారు రాసిన "బంగారు మురుగు" కథ చదివాకా, నా బాల్యం గుర్తుకు వచ్చింది. బామ్మ అందరికీ బాల్యపు తీపి గుర్తు. ఈ కథ చదువుతుంటే, మా బామ్మ కూడా ఇలానే ఉండేది అనో, ఇలాంటి బామ్మ నాకూ ఉంటే ఎంత బాగుండేది అనో అనుకోని వారు ఉండరు.

ఇది అరవై ఏళ్ల బామ్మకూ, ఆరేళ్ల మనవడికీ మధ్య సాగే కథగా మాత్రమే గాక, మన మధ్య జరుగుతున్నదా అన్నట్టూ, ఆ కథలో మనమూ పాత్రలై ఉన్నామా అనిపించేట్టూ సాగుతుంది. గట్టి పిండంగా పేరు తెచ్చుకున్న బామ్మకు మనవడన్నా, తన చేతికున్న బంగారు మురుగు అన్నా, తాను పుట్టింటి నుంచి కాపురానికి వస్తూ తెచ్చుకున్న పెరటిలోని బాదం చెట్టన్నా ప్రాణసమానాలు. ఈ బాదం చెట్టే బామ్మా మనవళ్ల స్థావరం. ఇద్దరికీ రోజులో మూడు వంతులు అక్కడే కాలక్షేపం. బామ్మ తత్త్వం ఎవరికీ బోధపడదు. ఎదుటివారిని మాట్లాడనీయక, తన దైన వాగ్ధాటితో, ప్రేమావాత్సల్యంతో అబద్ధం చెప్పాలనుకున్న వారితో కూడా నిజం చెప్పించగలదు. కొడుకూ కోడలూ ఆస్తిని స్వామీజీలకు కైంకర్యం చేస్తూంటారు. బామ్మ మాత్రం వచ్చే పోయే స్వామిజీలను ఆటపట్టిస్తూంటుంది. ఒక స్వామీజీ దృష్టి బామ్మ బంగారు మురుగు మీద పడుతుంది. దాన్ని ఎలాగైనా తనకు దక్షిణగా దక్కించుకోవాలని ప్రయత్నిస్తాడు. బామ్మ మాత్రం ససేమిరా అంటుంది. స్వరాజ్య పోరాటమప్పుడు గాంధీ గారు తమ ఊరు వచ్చి గుమ్మం ముందు జోలె పట్టినా ఇవ్వనిదాన్ని ఇప్పుడీ సర్కస్ కంపెనీకి ఎందుకు ఇస్తానంటుంది. కూతురి కళ్లూ దాని మీద పడతాయి. ఐనా బామ్మ పట్టువిడవదు. దాని మీద ఆమెకు కాపీనమని మనకు అనిపిస్తుంది. కాలం గడుస్తుంది. బామ్మ ఎంతో చొరవతో మనవడి పెళ్లి చేయిస్తుంది. మనవడు వేరే ఊళ్లో కాపురం పెడతాడు. బామ్మని రమ్మన్నా రాదు "నా ఊరు నా నేల.. ఇక్కడే మట్టయిపోవాలిరా..." అంటుంది. జబ్బు పడి మంచం పట్టిన రోజుల్లో చూట్టానికి వచ్చిన మనవడి కంగారు చూసి "నిన్ను వదిలి ఎక్కడికి పోతాన్రా వెర్రి నాగన్నా... అలా వెళ్లి కాసేపు పెత్తనం చేసి మళ్ళీ నీ ఇంటికే వస్తాగా..." అంటూ ధైర్యం చెప్తుంది. చనిపోయాకా, తీరా చూస్తే ఆమె బంగారు మురుగు గిల్టుదని తేలుతుంది. అందరూ ఆశ్చర్యపోతారు. మనవడు మాత్రం గ్రహిస్తాడు, బామ్మ తన పెళ్లి జరిపించింది ఆ బంగారు మురుగుతోనే అని.

శ్రీరమణ గారు ఈ కథను మలచిన తీరు, ఆయన శైలి నాకు నచ్చాయి. శ్రీరమణ గారు బామ్మలో చాలా కోణాలనే చూపించారు. మాటల్లో దర్జా, దర్పం, నేర్పుగా మాట్లాడి ఎదుటివాళ్లని ఆట కట్టించగల వాక్చాతుర్యం, తను అనుకున్నది సాధించగల పట్టుదల, ప్రేమా, వాత్సల్యమూ, దయా... ఆమె సుగుణాలు.

ఈ కథలో బామ్మ మాటలు కొన్ని:
"దయ కంటే పుణ్యంలేదు, నిర్దయ కంటే పాపం లేదు. నాది అనుకుంటే దుఖం, కాదు అనుకుంటే సుఖం."
"చెట్టుకు చెంబుడు నీళ్ళు పోయడం, పక్షికి గుప్పెడు గింజలు చల్లడం, పశువుకి నాలుగు పరకలు వెయ్యడం, ఆకొన్న వాడికి పట్టెడు మెతుకులు పెట్టడం... నాకు తెలిసిందవే."
"ఆ పిల్ల గోరంటాకుతో పారాణీ పెట్టుకుంటే నీ కాళ్ళు పండాలి, నువ్వు ఆకు వక్క వేసుకుంటే ఆ అమ్మడు నోరు పండాలి. మీ కడుపు పండాలి,  నేను మళ్ళీ నీ ఇంటికి రావాలి."
అమ్మ తరువాత తన పొత్తిళ్లలో దాచుకుని ఆప్యాయంగా గారాబం చేసేది బామ్మ ఒక్కతే. ఆమె దగ్గర ఉన్న చొరవ మరెక్కడా ఉండదు. అమ్మ పెట్టడం ఆలస్యం చేస్తే తాను ఆప్యాయంగా కడుపు నిమిరి అన్నం తిన్నా్వా నాన్నా అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని కడుపు తడుముతుంది.

ఉమ్మడి కుటుంబాలు పోయాయి, ఒంటరి జీవితాలు వచ్చాయి. ఈ హైటెక్ యుగంలో అలాంటి ఆప్యాయతలకు అనురాగాలకు దూరంగా చాలా దూరంగా వెళిపోతున్న మనం, మన కడుపున పుట్టిన పిల్లల గురించి మాత్రమే ఆలోచించే మనం,  ఒక సంపాదనా యంత్రాలుగా మనుగడ సాగిస్తున్నాం. ఇలాగే సాగితే ఈ ఆప్యాయతలు మనకు పుస్తకాల్లో మాత్రమే చదువుకోవటానికి మిగిలిపోతాయి. మన చిన్నతనంలో పొందిన ఆప్యాయతను మన పిల్లలకు అందీయలేకపోతున్నాం. వాళ్ళకు ఏం దూరం చేస్తున్నామో ఆలోచింపజేస్తుంది ఈ కథ.

Wednesday 25 September 2013

అల్లం శేషగి రావు కథ "చీకటి"

“చీకటి”... ఇది ఇంత అందంగా ఉంటుందని నాకు తెలీదు. నా మనసుకు హత్తుకున్న ఒక మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది ఈ కథ. నేను ఈ మధ్య చదివిన కథల్లో వర్ణనలతో కూడినది, మేధస్సుకు పదును పెట్టే శైలితో నన్ను ఆకట్టుకున్నదీ ఈ కథ. ఇది ఇద్దరి వ్యక్తులకు మధ్య జరిగే సంభాషణ. వారిలో ఒకరి జీవితంలో జరిగిన సంఘటనల సమాహరం.

ప్రతీ మనిషికీ ఒక కథ ఉంటుంది. అది చెప్పుకునే సందర్భాలు చాలా తక్కువగా వస్తాయి. అది ఎవరికి చెప్పాలో కూడా మనం నిర్ణయించుకోం. కానీ కాలగమనంలో మనకు తారసపడే వ్యక్తులలో మనసుకు నచ్చిన వారితో సందర్భానుసారంగా మన జీవితాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఎవరు గొప్పా, ఎవరు తక్కువ అన్నది చూపకుండా ఇద్దరినీ స్నేహితులుగా చూపుతూ, చదువుతోనే రాని, లేని జ్ఞానాన్ని చూపుతూ కథ నడిపిన తీరు నాకు నచ్చింది. ప్రకృతిని ఇష్టపడే వ్యక్తులు చాలామందే ఉంటారు, కానీ చీకటిని ఇష్టపడేవారు చాలా తక్కువ.  మన లోకం వెలుగు ఉన్నంత వరకే. కానీ దీపం వెలుతురు లేని చీకట్లోనూ అందం ఉందని ఈ కథ చెప్తుంది. పాఠకుడు ఈ కథ చదువుతున్నపుడు తన మదిలో ప్రతీ దృశ్యాన్నీ ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ప్రతీ దృశ్యం మన ముందే జరుగుతుందనే మాయాజాలం చేయటం రచయిత గొప్పదనం.

ఒకే చీకటిలో ఇద్దరు తమ నివాసాల నుంచీ వేటకని బయల్దేరతారు. ఒకరు వర్మ, ఒకరు డిబిరిగాడు. వర్మకి వేట వినోదం, డిబిరిగాడికి అదే జీవనాధారం.  మనం రోజూ చూస్తున్న మన చుట్టూ సంచరిస్తున్న వ్యక్తుల్లో చాలామందిని పట్టించుకోము. అలా పట్టించుకునేందుకు మనకు టైం లేదు. నా అనే స్వార్థంతో ఆలోచించే మనకు చుట్టూ ఉన్న వాళ్లతో సంబంధం ఎంత వరకూ అంటే మన పని చేయించుకునేవరకూ మాత్రమే.

మన పనులకు ఉపయోగించుకునే వాళ్లే కాదు, మనం పట్టించుకోని తక్కువ స్థాయికి చెందిన వాడే డిబిరి గాడు. వాళ్లకూ మనలాగే బాల్యం యవ్వనం వాటితో జ్ఞాపకాల ప్రపంచం ఉంటుందని, అందులో కష్టం సుఖం అన్నీ మిళితమై ఉంటాయనీ, రచయిత వాళ్ల జీవిత శైలిని చాలా క్షుణ్ణంగా విపులీకరించాడు. డిబిరిగాడు నక్కలోళ్ల జాతికి చెందిన సంచారజాతి వాడు. తన వృత్తిలో నైపుణ్యంతోనే గాక, జీవిత సాంరాంశాన్ని కాచి వడపోసినవాడిలా గతాన్ని గురించి తన జ్ఞాపకాల పొరలను తనకు ఎదురైన వ్యక్తి (వర్మ)తో చెప్పుకున్నాడు. డిబిరిగాడు వర్మలో సాటి వేటగాణ్ణి చూశాడే గానీ అతని స్థాయిని చూడలేదు.

తన తండ్రితో అతని అనుబంధం, వాళ్ల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వృత్తిలోని అతని కఠినత్వం అతని స్వభావం చెప్పుగోదగ్గవి. రచయిత డిబిరిగాడిని నిజాయితీకి ఒక గీటురాయిగా సూచించాడు. దీనివల్ల వాళ్ల జాతి ఒకటుందని పాఠకుడు ఒక్క క్షణం ఆలోచించేలా చేశాడు.

నన్ను కదిలించిన సన్నివేశం: ఉరి తీసే ముందు నీ ఆఖరు కోరిక ఏమైనా ఉందా చెప్పమని డిబిరిగాడి తండ్రిని అడిగితే అతడు జొన్న రొట్టెలు తెమ్మంటాడు. ఆకుల్లో రొట్టెల్ని చూస్తూ: “బాబూ నా కొడుకు ఇంకా రాలేదు. కానీ వస్తాడు. రాత్రంతా తిండి లేక కడుపు నకనకలాడిపోతూ పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆకలితో కరకరలాడిపోతూ ఉంటాడు. ఈ రొట్టెల్ని వాడికి ఇవ్వండి బాబూ. వాడికి బీడీలంటే చాలా ఇష్టం. నా కొడుక్కి నేనిచ్చానని చెప్పండి బాబూ. ఇక నాకు ఏ కోరికా లేదు.”

ఆ తండ్రి తన చావు గురించి విచారించక, తన బిడ్డ ఎలా ఈ ప్రపంచంలో బతుకుతాడో అని ఆఖరి నిముషం వరకూ అతని ఆలోచనలు బిడ్డ చుట్టూ తిరగడం, చివరి కోరిక కూడా వాడి కోసమే కోరడం... మనసులో నిలిచిపోతుంది.

ఉరిశిక్ష తీయబడుతున్న తండ్రిని కలుసుకోవాలని డిబిరిగాడు పరుగుపరుగున ఊళ్లు దాటుకుంటూ రావడం, అతని ఆత్రం, చివరికి తండ్రి శవాన్ని మాత్రమే చూడగలగటం... ఇదంతా నా కళ్ల ముందు జరిగినట్టు భావించాను.

నాకు నచ్చిన దృశ్యం (శేషగిరి రావు శైలిని ఈ పేరా పట్టిస్తుంది):

"బార్... బక్... గొగ్గొగ్గొ..." మని తుంగ దుబ్బుల్లో నుంచి గూడకొంగ రెక్కలు కొట్టుకుంటూ లేచింది. డిబిరిగాడు చటాలున తుపాకీ ఎత్తి దాని గమనంతో పాటే గురి సారిస్తున్నాడు. మెడ సాగదీసుకుంటూ, వెనక్కాళ్లు చాచి గాలిలో రెక్కలు కొట్టుకుంటూ అపుడే లేచిన సూర్యుడికి అడ్డంగా నల్లగా దాటబోతోంది. తుపాకీ గురి వెంటాడుతోంది. 'ధూమ్'! డిబిరిగాడి తుపాకీ పేలింది. దెబ్బకి ఠప్ మని దూది పింజె పిట్లిపోయినట్టు గుప్పెడు వెంట్రుకలు గాలిలో మెరుస్తూ తేలుతున్నాయి. గాలిలోనే చచ్చిన గూడ కొంగ నిండుగా లేస్తున్న ఎర్రటి సూర్యబింబం నేపథ్యంలో విరిగిపడిన చీకటి పెళ్లలా బరువుగా దబ్బున నీటిలో పడిపోయింది. 

ఈ సన్నివేశాన్ని నేను నా కళ్లతో చిత్రించుకున్నపుడు కలిగిన అనుభూతి మాటల్లో వర్ణించలేను. నా దృష్టితో ఒక కెమెరా లోంచి చూసినట్లుగా అనిపించింది.

ఈ కథతో సాహిత్యం ఒక స్థాయి నుంచే రాయాలని, రచన చేయాలని హద్దులను చెరిపేసింది. రచనకు హద్దులు లేవు. పేద గొప్ప బేధాలు లేవు. నగరీకరణే కాదు, బడుగు జీవుల జీవితాల్లోనూ ఎన్నో ఎత్తు పల్లాలను ప్రకృతిలోని అందాలను పాఠకుల హృదయాల్లోకి తుపాకీ గుండులా దూసుకుపోయేలా చేయొచ్చు. అని రచయిత తెలియజేశాడు.

జోహార్లు అల్లం శేషగిరి రావు గారు!  

Tuesday 24 September 2013

జీవం


నా సుగంధ పరిమళాలు 
దిగంతాలు వ్యాపించడం తెలుసు
ఏటి ఒడ్డున నిలుచున్న నాకు నీటి గలగలలు తెలుసు
నా నీడన శయనించిన ప్రేమ జంటల కిలకిలలు తెలుసు
ప్రతి వెన్నెల రాత్రి నెలరాజు పలకరింపుగా నవ్వింది తెలుసు
పక్షులు నాపై వాలి పాడిన విరహగీతాలు తెలుసు
చిట్టి చేపలు నీట తేలి నా నీడతో సయ్యాటలాడటం తెలుసు
కానీ ఇప్పుడన్నీ 
చాలా దూరంగా
 పారిపోయాయి 
ఎందుకనో
మరి నాలో 
పూర్వపు
జీవం లేదనో
ఆకులు రాలి
పువ్వులు వడలి
మోడుగా మిగిలాననో

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...