Tuesday 12 November 2013

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

హిమజ్వాల నవల వడ్డెర చండీదాస్ రచించారు. కథ ప్రారంభంలో గజి బిజిగా అనిపించింది. నెమ్మదిగా పాత్రల స్వభావాలను అర్థం చేసుకుంటూ కథలోని ఉద్దేశాన్ని తెలుసుకోడానికి పూర్తిగా చదివాను. ఈ కథ మనిషి మనసు ఎన్ని రకాలుగా మారుతుందో ఎలాంటి నిర్ణయాలను తీసుకునేలా చేస్తుందో తెలుపుతుంది. కృష్ణచైతన్య, గీతాదేవి అనే పాత్రల చుట్టూ నడుస్తుంది కథ.

కథావిషయం:—

ఉన్నతమైన కుటుంబానికి చెందిన కృష్ణచైతన్య కాలేజీ లెక్చరర్. ఒకనాడు రోడ్డు మీద అతనికి అపస్మారక స్థితిలో తారసపడుతుంది గీతాదేవి. ఆమెది మధ్యతరగతికి కుటుంబ నేపథ్యమైనా ఉన్నత చదువులు చదివింది.

ఒంటరిగా ఉన్న అతనికి మొదటిసారిగా ఆమెపై కలిగిన  అనురాగం ఆరాధనలను ప్రేమ పూర్వకంగా కాక కోరికగా తెలుపుతాడు. అతని నుండి ఆమె దూరంగా వెళిపోతుంది.

బొంబాయిలో ఉన్న స్నేహితురాలి దగ్గరకు చేరుతుంది. అక్కడ స్నేహితురాలి భర్త ఆమెను వేధించటంతో, చివరకు కృష్ణచైతన్య స్నేహితుడైన శశాంక్ సహాయంతో ఒక పత్రికలో చేరుతుంది. కొన్నాళ్ళకు లెక్చరర్ గా స్థిర పడుతుంది.

అక్కడే శివరాం తో పరిచయం అవుతుంది. ఆ పరిచయం కొన్నాళ్ళకు ప్రేమగా మారి పెళ్ళికి దారితీస్తుంది. అతనితో కొత్తజీవితం కొన్నాళ్ళు సరదాగా సాగుతుంది. శివరాంది ఫక్తు మధ్యతరగతి మనస్తత్వం. అతను శృంగారంలో తన అసమర్థతల్నీ, ఆత్మన్యూనతల్నీ కప్పిపుచ్చలేక ఆమెను దూరం పెడతాడు. మళ్లీ గీతాదేవిని ఒంటరితనం వేధిస్తుంది. ఒకసారి ఇద్దరూ అరకులోయకు వెళతారు అక్కడి అందాలకు ముగ్ధురాలైన గీతాదేవి ప్రకృతి సమక్షంలో భర్త సాంగత్యాన్ని కోరుతుంది. అది తప్పుగా భావించిన శివరాం ఆమెను దూషించి వెళిపోతాడు.

ఆవేశంగా భర్త నుండి దూరంగా వచ్చేసిన గీతాదేవి గమ్యం తెలియక నడకసాగిస్తుంది. ఆ దారిలో విజయ సారథి వయసుమళ్లిన వ్యక్తి ఆమెకు తారసపడతాడు. ఇద్దరి ఒంటరితనాలు పోయి, ఒకరికి ఒకరు తోడౌతారు. విజయసారథి ఆమెను తన ఇంటికి తీసుకువెళ్తాడు. అప్పుడే కృష్ణచైతన్య తండ్రే విజయసారథి అని ఆమెకు తెలుస్తుంది. అయినా అది బయటపెట్టకుండా అతని ప్రియురాలి హోదాలో ఆ ఇంట్లో ఉండిపోతుంది.

గీతాదేవికి దూరమైన తర్వాత కృష్ణచైతన్య ఊటీకి బయలుదేరతాడు. అక్కడ   చిదంబరరావుతో పరిచయం అవుతుంది. అతనికి ఉన్న అనారోగ్యం వల్ల మరి ఎంత కాలమో బతకడని తెలుస్తుంది. భర్త అనారోగ్యన్ని ఆసరాగా తీసుకుని అతని భార్య మాధురీ దేవి , కృష్ణచైతన్యను లోబరుచుకుంటుంది. ఒక ముని ఇచ్చిన మూలిక కారణంగా పూర్తి ఆరోగ్యవంతుడైన చిదంబరరావు భార్యను తీసుకుని తన ఊరికి వెళిపోతాడు.

మరోసారి తిరస్కారానికి గురి అయిన కృష్ణచైతన్య అది భరించలేక చెడుసావాసాలకూ అలవాట్లకూ బానిస అవుతాడు. చివరకు అఖిలానంద ఆశ్రమంలో చేరతాడు. తండ్రి మరణ వార్తవిని ఇంటికి వెళతాడు. అక్కడ గీతాదేవిని చూసి ఆశ్చర్యపోతాడు.

బంధువులంతా గీతాదేవిని ఆస్తి కోసం వలపన్ని విజయ సారథిని వశపరచుకున్నదని నిందిస్తారు. కృష్ణచైతన్య గీతాదేవిని ప్రేయసిగా చేరదీయాలనుకుంటాడు, అతని ఉద్దేశం తప్పనీ, తాను అతని తండ్రి ప్రియురాలిననీ, అతనే తన సర్వస్వమనీ అంటుంది. ఆమె మాటలను కృష్ణచైతన్య నమ్మనంటాడు.

బంధువులని సాగనంపడానికి రైల్వేస్టేషన్ కి వచ్చిన వాళ్లకు శివరాం తారసపడతాడు. మాట్లాడాలని బలవంతం పెట్టి కృష్ణచైతన్య ఇంటికి వస్తాడు. అక్కడ గీతాదేవితో గొడవకు దిగుతాడు. ఆమెను తనతో రమ్మంటాడు. గీతాదేవి తాను స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నానని అతనితో రావడం కుదరదని చెపుతుంది. ఆమె నిరాకరించడం భరించలేని శివరాం ఆమెను తన తలతో పదే పదే మోదుతాడు ఇద్దరి ప్రాణాలు పోతాయి.

పాత్రలపై నా అభిప్రాయం:—

కృష్ణచైతన్య: ఉన్నతమైన చదువు, విజ్ఞానం కలిగినవాడైన కృష్ణ చైతన్య తన జీవితానికి సరైన  మార్గాన్ని ఎన్నుకోలేకపోయాడు. ఆడదాని మనసు అర్థం చేసుకోలేకపోయాడు. విచక్షణను వదలి స్నేహితుని భార్యతో వ్యామోహంలో పడతాడు. తాను చేస్తున్నది తప్పని తెలిసుకునే నాటికి అతని నుండి అందరూ దూరం అవుతారు.

గీతాదేవి: వెంటనే కోపం, వెంటనే ప్రేమ, వెంటనే ద్వేషమూ, వెంటనే వైరాగ్యం ప్రదర్శించే పాత్ర ఆమెది. స్పృహ తప్పి ఒంటరిగా రోడ్డు మీద పడి ఉన్న తనను చేరదీసి, ఆశ్రయం కల్పించి, ఆదరించాడు కృష్ణచైతన్య. అతడు తనను ఇష్టపడుతున్నాడని తెలిసి కూడా మౌనం వహించింది.

తనను కష్టంలో ఆదుకున్న వ్యక్తి పట్ల అభిమానంతో కృతజ్ఞతతో వ్యవహరించి, ఆదరించిన ఆ పందిరికి తీగలా అల్లుకుని ఉంటే తన జీవితం మరింత అందాన్ని సంతరించుకుని ఉండేది. అతని నుండి వెళ్ళి తన జీవితానికి గమ్యమనేది లేకుండా చేసుకుంది.

ప్రేమ అన్న మనిషితో మరో మారు ఆలోచించకుండా అంగీకరించడం, పెళ్ళి అనే పెద్ద నిర్ణయాన్ని ఒక్క గడియలోనే తీసుకోవడం, పెళ్లి తర్వాత జీవితాన్నీ, ఆ ఇంటి పరిస్థితులనూ, అతని మనస్తత్వాన్ని సరిగా అర్థం చేసుకోపోవడం ఆమె వివాహం విఫలమవటానికి కారణం.

భర్త నుండి గొడవ పడి ప్రేమను, పెళ్ళినీ, తెంచుకున్న మరు నిముషంలోనే ఇంకో వయసు మళ్ళిన వ్యక్తికి చేరువవుతుంది, అతను పెళ్ళి మాట ఎత్తినా వారించింది. గతంలో తనకు ఆశ్రయం ఇచ్చి, తనను ఇష్టపడిన వ్యక్తికి ఇతడు తండ్రని తెలిసినా మాట్లాడక ఆ ఇంట్లోనే ఉండిపోయింది.

ఆమె జీవితంలో ఈ మలుపులన్నీ ఆమె మొండి వైఖరిని ఫలితాలే. సంఘపు కట్టుబాట్లను గౌరవించకపోయినా, తన మనస్సాక్షికి కూడా కట్టుబడలేని ఈ పాత్రని చూసి నాకు జాలి కలిగింది. చదువుతో వచ్చిన విజ్ఞానాన్ని ఎక్కడా ఉపయోగించుకోలేకపోయింది. లోకం పోకడ తెలిసీ తెలివిగా వ్యవహరించలేకపోయింది. ఎన్నో మలుపులు తిరిగి ఎక్కడా తృప్తి తీరం చేరలేక చివరకు చావు ఒడిలోకే చేరింది.

* * *

ప్రకృతి వర్ణనలను మన కళ్ళ ముందు మెదిలేలా రచించారు రచయిత. ముఖ్యంగా అరకులో జరిగే సన్నివేశాలు చాలా నచ్చాయి. ఒక వర్ణన:

"పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగకొద్దీ కాల్చి - అక్కడికీ కసి తీరక దోసిళ్ళతో మసి యెత్తి గాలిలోకి యెగబోసి, వెళ్ళిపోయాడు సూర్యుడు."

4 comments:

  1. Thanq srisanthi gaaru,...manchi book naaku parichayam chesaaru..:-):-)

    ReplyDelete
  2. good analysis. But you should not disclose key events of the story.

    ReplyDelete
  3. Good....maa rojullo Chandidas gari HIMAJWALA and ANUKSHANIKAM novels chadavani vaallani...............ga choosevaallam.

    Rendu goppa rachanale kani anukshanikam mari kastha......
    andhrajyothy weekly (appatlo vundedi) kosam kottuku chachevaallam aa rojullo. Veetitho pate Binadevi gari HANG ME QUICKkooda..
    ee review chaduvuthuu 40 samvatsaraalu venakki velli poya.
    Thanks you very much.
    annatlu anukshanikam chadavadam marchipoku.....andulo Swapnaragaleena inka nannu haunt chesthuune vuntundi.

    ReplyDelete
  4. మరోసారి చదవండి... మీ సమీక్షలోని కొన్ని భావాలు మార్చుకుంటారేమో....

    ReplyDelete

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...