Wednesday 20 March 2019

నమ్మిన బంటు....

పౌర్ణమి వెన్నెల వెలుగుకు దారికి మధ్యగా ఉన్న ఆ తోట మంచుకొండలా వెలిగిపోతుంది. కానీ చెట్లు కమ్మేసిన ఆ ఇంటి ప్రాంతం మాత్రం చీకటిలో మరింత భయం కలిగిస్తూ ఉంది. దూరంగా మినుకుమినుకు మంటూ వెలుగుతున్న గుడ్డిదీపం వెలుగులో పాడుబడ్డ పెంకుటింట్లో కునుకురాక పక్కమీద కదులుతున్నాడు అప్పన్న. తన యజమానికి నమ్మినబంటయిన అప్పన్న చాలా ఏళ్ళుగా ఈ పద్నాలుగెకరాలూ కావలి కాస్తున్నాడు. మామూలుగా నడిజామేళకు నక్కలు ఊళకు తోడు ఈరోజు తీతువు పిట్ట అరుపొకటి. చిన్నగా ఒత్తి తగ్గించిన లాంతరు బుడ్డిని చేత్తో తడుముకుంటూ ఒత్తి పెద్దగా చేసి గాలిలో ఆడించాడు. గోడకానించిన చేతికర్రను అందుకుని తన గది దాటి అరుగుమీదకు వచ్చి, చేతికర్రతో గోడమీద బలంగా కొట్టాడు. మళ్ళీ మళ్ళీ అదేపని చేసాడు. ఆ శబ్దం గట్టిగా రాగానే నక్కల ఊళలు ఆగిపోయాయి. అతడికి దానికి అర్థం తెలిసిన వాడిలా మూల గది వైపు అడుగులు వేసి అరుగు ముందు నాలుగడుగులు వెనక్కు వేసి లాంతరు పైకెత్తి తదేకంగా ఆ గదివేపే చూస్తున్నాడు.

చుట్టుపక్కల అంతా నిశ్శబ్దం. అప్పటివరకూ వినిపించిన కీచురాళ్ళ శబ్దాలు, తీతువు అరుపులు, నక్కల ఊళలు అన్నీ ఆగిపోయి. వాటి స్థానంలో భయంకర నిశ్శబ్దం. దీనికి తోడుగా తుఫానులో అడ్డంగా పడిపోయిన తాటిచెట్టు మరీ భయంకరంగా కనిపిస్తుంది. "ఏంటిది ఎందుకు నేను ఈరోజు ఇంతగా భయపడుతున్నాను. ఎన్నాళ్ళమట్టీ ఇదంతా నాకు తెలీదు. వయసుమీద పడటల్లా.. ఇలా భయపడటం మామూలే.." అనుకుని కాస్త స్థిమితంగా అరుగు దాటి రెండు అడుగులు వేసాడు. ఇంతలో...

"ఏమిరా నిద్ర పట్టడంలేదా! నన్ను శాశ్వతంగా నిద్రపుచ్చి మీరు నిద్ర పోతారా ఆహా ఆహా హా! ఉండరు.. ఎవరూ బతకరురా... ఆహా..హా..హా.." మగ గొంతు ఆడగొంతూ కలిసి జీరగా వస్తున్న అరుపులాంటి మాటలకు అప్పన్న నిర్గాంతపోయాడు. కంగారుగా తన గదిలోకి పరుగు తీసాడు. ఆ భయంకరమైన అరుపులకు చెట్లమీద మాగన్నుగా నిద్రపోతున్న రాబందులు ఎగిరిపోయాయి. రాటకు కట్టిన పశువులు బెదిరిపోయాయి. ప్రశాంతమైన పరిసరాలు ఒక్కసారిగా ఉనికి తెచ్చుకున్నాయి.

గదిలోకి పరుగున వచ్చిన అప్పన్న మంచానికి అడ్డంగా కూలబడిపోయాడు. ఇక ఈ రాత్రికి అతడికి నిద్రలేనట్టే. ప్రతి అమావాస్యనాడూ కపిలేశ్వరపురం రాజుగారు మంత్రించి ఇచ్చిన వీభూతి పండు తలకింద పెట్టుకుంటాడు. గుమ్మానికి రాగిరేకుకు సాంబ్రాణి పొగ చూపి మూల గది అరుగుకుకి నాలుగడుగుల ముందు మంత్రించిన తాయత్తు మాల పాతిపెడతాడు తెల్లారి మళ్ళీ కాళీ మాత పటానికి తగిలిత్తాడు. అలాటిది ఈయాల సారామత్తులో ఇలా చిత్తయిపోతానుకోలేదు. ఇదెక్కడి చిక్కురా దేవుడా.. ఆ ఈరిగాడు తోడన్నాలేడే.. అలా ఆలోచిస్తూనే చుట్టతాగుతూ గోడకున్న ఊక బస్తాకి జారపడ్డాడు.

* * *

అడవిని తలపించే ఆ ప్రాంతానికి రారాజు నరసరాజు. అతని తాతలనాటి ఆస్తిని అన్నదమ్ములు పంచుకుంటే.. అతని వాటాగా వచ్చిన ఈ పద్నానాలుగెకరాల్లో అతను చేయని వ్యాపారమంటూలేదు. రాజంటే రాజే.. దివాణంలా ఎప్పుడూ నలుగురు ఊరి పెద్దలు రాజుగారికూడా ఉంటారు. ఎప్పుడూ తాగుతూ మత్తులో జోగే రాజుగారికి పేకాట, కోడిపందాలంటే చాలా మోజు. ఇక పిట్టల వేటన్నా అంతే.. పక్క ఊళ్ళల్లో పైటేసిన ప్రతి కన్నె వాళ్ళ విందుల్లో ఉండాల్సిందే.. చుట్టుపక్కల కోళ్ళఫారాల్లో పనికి వచ్చే ప్రతి ఆడపిల్లా వీళ్ళ చూపుల్ని తప్పించుకుని బతకలేదు, మారు మాట్లాడారా.. తెల్లారి జబ్బుచేసిన కోళ్ళకు వేసే విషం గుళికలు తిని శవాలైపోతారు. ఇదంతా తెలిసినా మాట్లాడే దమ్ము అక్కడివాళ్ళకు లేదు.

ఎప్పుడూ ఏదో సందడితో, నాలుగు కాలాలు కళకళలాడే తోట సంక్రాంతికి మరీ జోరుగా ఉంటుంది. అప్పుడు వేటలు, కోళ్ళు, జింకలు, నెమళ్ళు అన్నీ మాంచి సువాసనలు వెదజల్లుతూ. కమ్మని కూరలైపోతాయి. ఊళ్ళో వాళ్లు ఆ సమయంలో ఏదో పనిపెట్టుకుని మరీ రాజుగారి దర్శనం చేసుకుపోతారు. పండగ వేళల్లో పందెంకోళ్ళ సందడి కూడా తక్కువేంకాదు.

రాజుగారికి ఇద్దరు భార్యలు నీలాంబరి, ఈశ్వరి. ఇద్దరినీ చెరోవైపూ పెట్టుకుని గుర్రం బండిమీద చెన్నకేశవ ఆలయానికి ఆయన వస్తుంటే.. ఊరోళ్ళంతా లేచి నిలబడేవారు. ఎన్ని పూజలు చేసినా.. పాపం రాజుగారికి ఒక భార్యకు బిడ్డలు కలగలేదని మరొకళ్ళని కట్టుకున్నా జాతకమేం మారలేదు.

ఒకరోజు రాజుగారి మిత్రులంతా పక్కూరి నుండీ స్వామీజీని తీసుకువచ్చారు.. ఆయన చెపితే ఇద్దరి భార్యల్లో ఎవరో ఒకరికి బిడ్డలు తప్పకుండా పుడతారని, ఏవో పూజలు చేయించడానికి రాజుగార్ని ఒప్పించారు. రాజుగారికి లోపం భార్యల్లో కాదు తనలో ఉందని తెలిసినా.. పైకి చెప్పుకోలేక పరువుకోసం తలవంచాడు. అమావాస్యనాడు పూజకు తోటలో ముహుర్తం పెట్టి వేటను బలివ్వాలని చెప్పి ఆవేళకు వస్తానని వెళిపోయాడు స్వామి.

అమవాస్యనాడు చేయ్యాల్సిన పనులన్నీ ముందురోజే పుర్తిచేసారు పనోళ్ళంతా..పూజకు అన్నీ సిద్ధం చేసి స్వామికి కబురంపారు. నేను చెప్పిన వేళకు వస్తాను. మీ రాజుగారితో సహా ఇద్దరు భార్యలూ రాత్రి ఎనిమిది గంటలకల్లా తోటలో ఉండేలా చూడమన్నాడు స్వామి. అప్పన్న స్వామి చెప్పిన ములికలతో హోమగుండం వెలిగించాడు. తన ఇద్దరి భార్యలతో సహా అన్న సమయానికి పూజలో కూర్చున్నాడు రాజుగారు.

ఆ అమావాస్య రాతిరేళ ఆ నిశ్శబ్ద ప్రదేశంలో స్వామి చదివే మంత్రాలు, హోమగుండం వెలుగులో చల్లుతున్న పసుపుకుంకుమలు చూసేందుకు భయంకరంగా ఉన్నాయి. రాజుగారి ఇద్దరి భార్యల అరచేతుల్లో పదునైన కత్తితో గాటుపెట్టాడు స్వామి. ఆ రక్తాన్ని కాళీమాతకు దర్పణంగా సమర్పించాడు. చుట్టూ ఉన్న వాళ్ళతో బలిని సిద్ధంచేయమని, చెప్పి పూజముగించి వెళ్ళిపోయాడు.

* * *

నీలాంబరీ, ఈశ్వరీ కి ఆరోజు పెద్ద గొడవే అయ్యింది. ఇద్దరూ బిడ్డలు కలగలేదని నువ్వు గొడ్రాలంటే.. నువ్వని ఆవేళ గట్టిగా అరుచుకుంటున్నారు. పనోళ్ళంతా దొడ్డిగుమ్మంలో వరండాలో జరుగుతున్నది వింటూ ఉండిపోయారు. దొడ్డిగుమ్మం లోపలికి గడియవేసి ఉంది. నీలాంబరి పురుగుల మందు డబ్బా పట్టుకుని.. తాగేసింది. ఈశ్వరి కూడా కోపంగా వచ్చి నీలాంబరి చేతిలో డబ్బాలాక్కొని తాగేసింది... కాసేపటికే ఈశ్వరి నురగలు కక్కుతూ వాంతులుచేసుకుని చనిపోయింది. విషం తాగానని చెప్పి పెదాలకు పైపూతగా పెట్టుకున్న నీలాంబరి మైకం వచ్చినట్టు పడిపోయి ఉంది. రాజుగారు ఊళ్ళోకి అడుగు పెట్టే వేళకు జరిగింది తెలుసుకుని నిర్ఘాంతపోయాడు.

కొద్దిరోజుల క్రితం తోటలో ఆ వేళ జరిగిన పూజ వల్లనే ఇదంతా జరిగిందని.. రాజుగారికి సంతానం కోసం ఎరకలోళ్ళ పిల్లను ఆ రాతిరేళ బలిచ్చారని ఊళ్ళో అంతా చెప్పుకున్నారు. జరిగిందంతా తెలిసిన నమ్మినబంటు అప్పన్న మాత్రం లేదు మనిషి కాదు మెకాన్నే బలిచ్చామని బొంకుతాడు. ఏది ఏమైనా రాజుగారి తోటలోకి అమావాస్య వేళేకాదు.. చికటిపడే వేళకు వెళ్ళాలన్నా ఇప్పటికీ గుండెలు గుభేలంటాయి....


*

No comments:

Post a Comment

పొడిబారిన ముద్దు..

కొన్నాళ్ళుగా నీ ముద్దు పెదవుల్ని అంటడం లేదు.. తడారిపోయింది చప్పగా.. జీవం లేనట్లుగా.. మారిపోతుంది నిజం నుంచి జ్ఞాపకంలా ఈ ముద్దే తరుముతోంది పె...