తెలతెల్లవారుతుంది. రాత్రి ప్రయాణం వల్లేమో పెద్దగా సమయం తెలీలేదు. నిద్రలోనే హైదరాబాద్ వచ్చేసాం. సికింద్రాబాద్ స్టేషన్ రాగానే దిగాల్సినవాళ్ళంతా నిద్రమత్తులో సామాన్లు గాలించి పట్టుకుని, పాచిముఖాలు సరిచేసుకుంటున్నారు. కొందరిలో ఇంకా అదే మత్తు. కీచుమని శబ్దం చేసుకుంటూ స్టేషన్లో ఆగింది రైలు. ట్రైన్ కంపార్ట్ మెంట్ అంతా రొచ్చుకంపు. ముక్కులు మూసుకుంటూ, తోసుకుంటూ సామాన్లు దింపుకుంటున్నారు. ఎంతటి జనమో గాలి ఆడనంత., సందు దొరకనంతమంది. అతికష్టం మీద స్టేషన్ దాటి రోడ్డుమీదకు వచ్చాం. తెల్లారలేదు. ఆకాశం మబ్బులు పట్టి, మసగ్గా ఉంది. “ ఇంకా ఎంత సేపు.. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి ”? “ నాకూ తెలీదు.. కనుక్కోవాలి. అందాకా ఓపికపట్టు..ఇదిగో ఈ గట్టువార కూర్చో, నేను ఇప్పుడే ఫోన్ చేసివస్తాను ” . ఆకాశం ప్రశాంతంగా ఉంది. గాలికి ఊగుతున్నాయ్ చెట్లు.., జనంలో కలిసి, అతను చూపుకు అందడంలేదు. ఫోన్ బాక్స్ ఎక్కడ ఉందో వెతకాలి కదూ.. నాకేం భయంగా లేదు. తను వస్తాడు. కానీ త్వరగా రావాలి. ఇలా ఒంటరిగా ఎదురుచూడటం చాలా కష్టంగా ఉంది. ఇద్దరు బిచ్చగాళ్ళు భుజం మీద సంచులతో నన్ను దాటుకువెళుతున్నారు. ఏంటో ఈ పరిసరాలు కాస్త ఇ...