ఉత్కంఠ భరితం "చంద్రగిరి శిఖరం"


బిభూతి భూషణ్ గారు బెంగాలీలో ప్రముఖ రచయిత. పదహారుకు పైగా నవలలూ, రెండొందల పైచిలుకు కథలూ రాశాడు. వాటిలో బాగా ప్రసిద్ధి పొందినవి “పథేర్ పాంచాలి”, “అపరాజితుడు”, “వనవాసి” అనే మూడు నవలలు. ఇవన్నీ ఇదివరకే తెలుగులో వచ్చాయి. ఇపుడు వీటిలా ఆత్మకథాత్మకంగా కాక, కాల్పనిక శైలిలో రచించిన “చంద్రగిరి శిఖరం” (చందే పహార్) కూడా కాత్యాయని గారి అనువాదంతో తెలుగులో వచ్చింది.

స్వతహాగా ప్రకృతి ఆరాధకుడైన బిభూతి భూషణ్ ఈ నవలలో ప్రకృతి సౌందర్యాన్ని, అందులోని విలయాలను, వింతలను, విశేషాలను కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తారు.

కథా విషయం:- శంకర్ ఓ పల్లెటూరి కుర్రవాడు. చదువు పూర్తి చేసుకొని గ్రామానికి వస్తాడు. కుటుంబ పరిస్థితుల వల్ల కెన్యాలోని మెుంబాసా దగ్గర రైల్వేశాఖలో గుమస్తాగా పనిలో చేరతాడు. అత్యంత ప్రమాద భరితమైన ఆ ప్రాంతం మానవుని రక్తాన్ని మరిగిన సింహాలకు నిలయమని తెలుసుకుని అక్కడికి ముఫ్పై మైళ్ల దూరంలోని కిసుమూ రైల్వే స్టేషన్‌కి స్టేషన్ మాస్టరుగా కొత్త ఉద్యోగంలో చేరతాడు. అక్కడ జనసంచారం తక్కువ. ఒక రోజు ఆ అటవీ ప్రాతంలో ఒక పోర్చుగీసు యాత్రికుడు డిగో అల్వరేజ్ అపస్మారక స్థితిలో కనిపిస్తాడు. శంకర్ అతణ్ని బతికిస్తాడు. అతను వజ్రాలకై తాను చేసిన సాహసయాత్రను గురించి చెప్తాడు. సాహసాలంటే మక్కువ గల శంకర్ అతనితోపాటూ తానూ సాహసయాత్రకు సిద్ధపడతాడు. ఇద్దరూ వజ్రాల కోసం ఆఫ్రికా అటవీ ప్రాంతంలోని చందేర్ పహార్ చేరుకుంటారు. ఈ యాత్రలో వారు దట్టమైన అడవుల్నీ, వింత జంతువుల్నీ, పక్షుల్నీ, సెలయేళ్ళనీ, వర్షాలు వరదలూ తుఫాన్లనీ, ఎడారుల్నీ... ఎన్నింటినో దాటుకు సాగుతారు. అగ్నిపర్వతం బద్దలవటం కూడా తమ కళ్ళతో చూస్తారు. ఏన్నో కష్టాలతో సాగిన ఈ యాత్రలో శంకర్ వజ్రాలగనిని చేరాడాలేదా అనే దాని కన్నా, అతడు ఆ భయంకర పరిస్థితుల నుండి ప్రాణాలతో బయటకు రాగలడా అనే ఉత్కంఠే మనకు ఎక్కువ కలుగుతుంది.

బిభూతి భూషణ్ గారి శైలి సరళంగా సాగుతుంది. ప్రకృతి వర్ణనలు స్వయంగా అనుభవించి రాసినట్టు స్వచ్ఛంగా ఉంటాయి. ఆశ్చర్యం ఏమిటంటే, తాను ఎరిగిన బెంగాల్ సరిహద్దులతో పాటూ, తాను ఎప్పుడూ చూడని ఆఫ్రికా అరణ్యాల అందాలను, అందులోని ప్రమాదాలను ఎంతో మనోహరంగా వర్ణించగలిగాడు. ఆయన శైలికి మచ్చుతునకగా ఈ భాగాన్ని ఉదహరిస్తాను:
ఎంతటి భయద దృశ్యమది! వాళ్ళిద్దరూ ఆ వైపునుండి కళ్ళు తిప్పుకోలేకపోయారు. నిప్పు ముద్దల్లా ఉన్న మేఘాలు కిందికి దిగి అగ్ని పర్యతపు ముఖ భాగాన్ని సమీపించి, మరుక్షణంలోనే అగ్నిజ్యాలలుగా మారి వెయ్యి అడుగుల ఎత్తుకు ఎగిసి పడుతున్నాయి. ఆ పగలూ, రాత్రీ కూడా అగ్ని పర్వతం మీదనుండి బాణాసంచా పేలుస్తున్న వెలుగులాంటిది కనబడుతూనే ఉంది. ఆ పర్వతం కింది భాగాన ఉన్న లోయలోని పెద్దపెద్ద వృక్షాలన్నీ రాళ్ల వర్షంతోనూ, అగ్నిజ్యాలలతోనూ ధ్యంసమయ్యయి. రాత్రి బాగా పొద్దుపోయాకా మళ్ళీ ఒకసారి పర్యతం బద్దలై నిప్పులు చిమ్మే అద్బుత దృశ్యం ప్రత్యక్షమైంది. ఆ మంటల వెలుగు, కనుచూపు మేరదాకా అడవికంతటికీ రుధిరవర్ణం పులిమింది. రాళ్ళవర్షం మాత్రం కాస్త తగ్గుముఖం పట్టింది. అగ్ని పర్వతపు అరుణ వర్ణాన్ని ప్రతిఫలిస్తున్న ఆకాశంలో నిప్పు కణికల్లా మెరుస్తున్నాయి మేఘాలు.
దృశ్యాన్ని తెచ్చి ముందు నిలిపే ఇలాంటి వర్ణనలతో పాటూ, ఊహాశక్తిని వింత దారుల్లో నడిపించే కథనం మనలో ఉత్కంఠను రేకెత్తిస్తూ సాగుతుంది, ఆద్యంతం ఒక సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగిస్తుంది. మన ఆలోచనల్లో ఆ ప్రాంతాలను, ఆ ప్రకృతినీ చిత్రించుకుంటూ చదువుకుంటూ పోతాం. ఆ సాహస యాత్రలో, ఆ ప్రమాదాల మధ్య మనమూ ఉన్నామా అనే భ్రమకులోనవుతాం. అనువాదకురాలు కాత్యాయని గారి శైలి సరళంగా ఉండి ఎక్కడా అనువాదంగా తోచలేదు. అచ్చ తెలుగు కథగానే అనిపించింది.

కామెంట్‌లు

  1. శాంతీ మీ కలం మంచి కహానీలు చెప్పాలి.కేవలం రివ్యులు మాత్రం కాదు. విషాదపూరిత రివ్యూలు అన్ని.నేను ఎప్పుడు వర్తమానంలో బతుకుతాను.గతం మరచిపోవాలి అనుకొంటాను.భవిశ్యత్తుపై ఎక్కువ ఆశలు పెంచుకోను. మనిషికి భగవంతుడు ఇచ్చినది ఒకటే మానవజణ్మ.
    రియల్ హాపీనెస్ లైస్ ఇన్ మేకింగ్ అదర్స్ హాపి.
    ఒకె ఉంటా మరి. లక్శ్మి

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

పంచాయతీ మెట్లు

గమ్యం తెలియని పాత్రల పయనం "హిమజ్వాల"

అల్లం శేషగి రావు కథ "చీకటి"